భూసేకరణ నిలిపివేయడం చాలా సంతోషకరమని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లో బలవంతపు భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర మంత్రి పి నారాయణ వెల్లడించిన విషయం తెల్సిందే.
దీనిపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో భూసేకరణ నిలిపివేయడమనేది ప్రభుత్వం ఏర్పడిన ఈ 15 నెలల్లో చేసిన మంచి పని అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి తెలియకుండానే భూసేకరణ జీవో జారీ అయిందని మంత్రి నారాయణ చెప్పడం వింతగా, విడ్డూరంగా ఉందన్నారు.
ఇంత అత్యవసరమైన అంశాన్ని సీఎంకు తెలియకుండా తానే చేశానని మంత్రి చెప్పడం చూస్తుంటే ఎవరు సిగ్గుపడాలో తెలియని పరిస్థితి అన్నారు. సీఎం, మంత్రుల పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్రస్తుత టీడీపీ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని బొత్స మండిపడ్డారు.